Indian Railways: భారతీయ రైల్వే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను మరింత సురక్షితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. 2025 సంవత్సరంలో రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఉపయోగించిన సుమారు 3.03 కోట్ల (30.3 మిలియన్ల) అనుమానాస్పద యూజర్ ఐడీలను బ్లాక్ చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. సామాన్య ప్రయాణికులకు టిక్కెట్ల బుకింగ్లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి – సైబర్ దాడుల నుండి వ్యవస్థను రక్షించడానికి ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
సైబర్ భద్రత – గణాంకాలు
రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు:
- హానికరమైన ఈమెయిల్స్: డిసెంబర్ 2025 వరకు గడిచిన ఆరు నెలల కాలంలోనే సుమారు 60.43 బిలియన్ల హానికరమైన ఈమెయిల్స్ ,బాట్ అభ్యర్థనలను రైల్వే వ్యవస్థ బ్లాక్ చేసింది.
- ఫిర్యాదులు: నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో 3.99 లక్షల అనుమానాస్పద బుకింగ్లకు సంబంధించి మొత్తం 376 ఫిర్యాదులు నమోదయ్యాయి.
- డొమైన్ల బ్లాకింగ్: 2025లో 12,819 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను అధికారులు నిర్ధారించి నిషేధించారు.
తత్కాల్ బుకింగ్లో కొత్త మార్పులు
తత్కాల్ టిక్కెట్లను ఏజెంట్లు లేదా సాఫ్ట్వేర్ బాట్లు అక్రమంగా బుక్ చేయకుండా నిరోధించడానికి రైల్వే శాఖ ఆధార్ ఆధారిత వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ధృవీకరణను ప్రవేశపెట్టింది.
- గుర్తింపు ధృవీకరణ: ఈ విధానం ద్వారా ప్రయాణికుడి గుర్తింపు తక్షణమే ధృవీకరించబడుతుంది, దీనివల్ల నకిలీ ఖాతాల ద్వారా బుకింగ్ చేసే అవకాశం ఉండదు.
- భద్రతా వలయం: వెబ్సైట్, యాప్ స్థాయిల్లో బహుళ స్థాయిల ‘కాప్చా’ (CAPTCHA) మరియు ఇతర భద్రతా నియంత్రణలను అమలు చేశారు.
- వేగవంతమైన బుకింగ్: వెబ్సైట్పై లోడ్ను తగ్గించడానికి ‘కంటెంట్ డెలివరీ నెట్వర్క్’ (CDN) ఉపయోగిస్తున్నారు.
అత్యాధునిక సాంకేతికత వినియోగం
నకిలీ యూజర్లను గుర్తించడానికి అకామై (Akamai) వంటి అత్యాధునిక ‘యాంటీ-బాట్’ సొల్యూషన్లను రైల్వే వినియోగిస్తోంది. ఇవి నిజమైన ప్రయాణికులను – ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్లను వేరు చేసి, సామాన్యులకు సులభంగా టిక్కెట్లు దొరికేలా చేస్తాయి. డేటా సెంటర్-గ్రేడ్ నెట్వర్క్ భద్రత ద్వారా ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందని మంత్రి అశ్విని వైష్ణవ్ భరోసా ఇచ్చారు.
