Vizag: బంగ్లాదేశ్ చెర నుంచి విడుదలైన తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు సురక్షితంగా విశాఖపట్నం తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో సముద్రంలో వేటకు వెళ్లిన వీరు, ఇంజిన్ వైఫల్యం, ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పి బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. దీంతో ఆ దేశ కోస్ట్ గార్డ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, బాగర్హాట్ జైలుకు తరలించారు. సుమారు మూడు నెలల పాటు అక్కడ నిర్బంధంలో ఉన్న వీరిని విడిపించేందుకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దౌత్యపరమైన చర్చలు జరిపాయి.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీలు శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. దీని ఫలితంగా జనవరి 27న బంగ్లాదేశ్ ప్రభుత్వం వీరితో పాటు మొత్తం 23 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది. విడుదలైన వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య మోంగ్లా పోర్టుకు తరలించి, అక్కడ వారి పడవలకు అవసరమైన మరమ్మతులు చేసిన అనంతరం భారత కోస్ట్ గార్డ్కు అప్పగించారు. ఫిబ్రవరి 1వ తేదీ రాత్రికి వీరు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నారు.
Also Read: Ganta Srinivasa Rao: వైసీపీ రాజకీయాలకు చరమగీతం అవసరం: గంటా ఫైర్
తీరానికి చేరుకున్న మత్స్యకారులకు జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని స్వగ్రామాలకు పంపేందుకు రవాణా ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మత్స్యకారులు సముద్ర సరిహద్దుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
