Election Commission:2029లో జరిగే లోక్సభ సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల (మార్చి)లోనే నగారా మోగనున్నది. 2026 మార్చి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనున్నది. మార్చి నెల మొదటి, లేదా రెండో వారంలోనే ఆ ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తున్నది.
Election Commission:పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం) రాష్ట్రాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఫిబ్రవరి 15 తర్వాత ఎన్నికల సంఘం పూర్తిస్తాయి బెంచ్ సందర్శించనున్నది. ఈ బెంచ్లో ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారు.
Election Commission:నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీల కాల పరిమితి వచ్చే మే నెలలోనే ముగుస్తుంది. ఈ మేరకు మార్చి నుంచి మే నెలల మధ్య ఎన్నికలు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా ఆయా నెలల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.
Election Commission:ఈ ఎన్నికల సంఘం పూర్తిస్తాయి బెంచ్ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత, ఓటర్ల జాబితాల వివరాలు, భద్రతా ఏర్పాట్లు, ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్ సాంకేతికత, ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించనున్నది. ఆ తర్వాత అన్నింటినీ బేరీజు వేసుకున్నాకే మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉంటుంది.
Election Commission:పశ్చిమబెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తమిళనాడులో 234, కేరళలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీయే కూటమి.. ప్రధానంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఉత్తరాదిలో అప్రతిహాత విజయాలతో అధికార పీఠాలు ఎక్కిన ఆ పార్టీ.. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, అటు పశ్చిమబెంగాల్లోనూ పాగా వేయాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతున్నది. ఉన్న అధికారాన్ని మళ్లీ వశం చేసుకోవాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, పినరయి విజయన్, మమతా బెనర్జీ సర్వశక్తులను ఒడ్డుతున్నారు.
