Hyderabad: ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. కరీంనగర్ సీపీ గౌస్తో పాటు పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని, బాధ్యతారాహిత్యమైనవని పేర్కొంది. ముఖ్యంగా సీపీ మతమార్పిడులకు పాల్పడుతున్నాడంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండించింది.
ఐపీఎస్ అధికారుల సంఘం ప్రకటనలో, ఒక ప్రజాప్రతినిధిగా కౌశిక్రెడ్డి మాట్లాడే మాటలకు బాధ్యత ఉండాలని పేర్కొంది. పోలీసు అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ఇది ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని తగ్గిస్తుందని హెచ్చరించింది.
ఈ వ్యాఖ్యలపై కౌశిక్రెడ్డి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సంఘం డిమాండ్ చేసింది. ఆయన క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.
