Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు (జనవరి 27, 2026) ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో, సభ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని ప్రభుత్వం కోరనుంది.
రేపటి నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయి.
ఇది కూడా చదవండి:
ఈసారి బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వం ‘విక్షిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు’ వంటి 9 ముఖ్యమైన బిల్లులను ఈ విడతలో ఆమోదించుకోవాలని చూస్తోంది. మరోవైపు, ప్రతిపక్షాలు కూడా పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ‘గ్రామీణ్’ చట్టం వంటి అంశాలపై కాంగ్రెస్ నిరసన తెలిపే అవకాశం ఉండటంతో సభలో వాడివేడి చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న కొత్త పన్నుల (టారిఫ్లు) ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు ఈ బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసే ఈ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయో లేదో వేచి చూడాలి.
