Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తూ కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా 2 వేల రూపాయలకు పైగా పెరగడం విశేషం. తాజాగా మంగళవారం నాడు కూడా ధరలు అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతున్నాయి. మన దేశంలో శుభకార్యాల సీజన్ కావడంతో ధరలు ఎంత పెరిగినా నగల దుకాణాలు మాత్రం కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,960 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,460 గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో ధరలు మరికొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,62,110 ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ. 1,63,920 కి చేరింది. ముంబై, బెంగళూరు నగరాల్లో కూడా దాదాపు హైదరాబాద్ రేట్లే అమలవుతున్నాయి.
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. నిన్న ఒక్క రోజే కిలో వెండిపై ఏకంగా 10 వేల రూపాయలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 3,75,100 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
