Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు తమ వేగాన్ని మరింత పెంచాయి. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను విచారించిన సిట్, ఇప్పుడు సంతోష్ రావును కూడా పిలవడంతో ఈ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) ఉన్నతాధికారుల నియామకాల్లో సంతోష్ రావు పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభాకర్ రావు వంటి అధికారులను కీలక బాధ్యతల్లో ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది, ఆ నిర్ణయాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు అనే అంశాలపై స్పష్టత కోసం సిట్ ఈ నోటీసులు ఇచ్చింది. మీడియా సంస్థల ప్రతినిధుల నుండి సేకరించిన సమాచారం, గతంలో అరెస్టయిన పోలీసు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా సంతోష్ రావును ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
Also Read: Nara lokesh: దేవుడు పెట్టే పరీక్షలను సంకల్ప బలంతో జయించాలి
మరోవైపు ఈ నోటీసులపై సంతోష్ రావు సానుకూలంగా స్పందించారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను విచారణకు హాజరవుతానని, పోలీసుల ప్రశ్నలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. విపక్ష నేతలు, వ్యాపారవేత్తల ఫోన్ల ట్యాపింగ్కు సంబంధించి తనకు ఏమైనా వివరాలు తెలుసా అన్న కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విచారణ తర్వాత ఈ కేసులో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయి, దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
