Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మీడియా అక్రెడిటేషన్ జీవో 52లో అనేక మార్పులు, చేర్పులతో జీవో 103ను సోమవారం విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన జీవోపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కచ్చితంగా మార్పులు చేయాల్సిందేనని, మీడియా గుర్తుంపు కార్డుల స్థానంలో అక్రెడిటేషన్ కార్డులుగానే ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేస్తూ వచ్చారు.
Telangana: తాజాగా విడుదల చేసిన జీవోనం.103లో ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా అక్రెడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. మీడియా యాజమాన్యాలు నియామకాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ను పాటించాలని సూచించింది. అక్రెడిటేషన్ల జారీలో కూడా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
Telangana: అదే విధంగా 2.5 లక్షల కంటే ఎక్కువ సర్య్కులేషన్ కలిగిన పత్రికలకు మండలాల్లో 1.50 లక్షల జనాభా కంటే ఎక్కువగా ఉంటే అదనంగా మరో అక్రెడిటేషన్ కార్డు జారీ చేయాలని నిర్ణయించింది. అదే 2.50 లక్షల సర్య్కులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిం విభాగాల్లో రాష్ట్రస్థాయిలో అదనపు అక్రెడిటేషన్ కార్డును సర్కారు మంజూరు చేయనున్నది.
Telangana: 75 వేల నుంచి 2.5 లక్షల సర్య్కులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిం విభాగాల్లో ఏదో ఒక దానిలో అదనపు కార్డును ఇవ్వనున్నారు. రాష్ట్రస్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీలో ఈ సారి హైదరాబాద్ ప్రెస్క్లబ్ ప్రతినిధితోపాటు పెద్ద దినపత్రికల నుంచి ఒక డెస్క్ ప్రతినిధికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ముఖ్యంగా మీడియా కార్డు అనేది లేకుండా దానిని అక్రెడిటేషన్ కార్డుగానే భావించాలని సూచించింది. అదే విధంగా ఉర్దూ బిగ్ న్యూస్ పేపర్ స్థానంలో ఉర్దూ డైలీ న్యూస్ పేపర్ అని పొందుపర్చింది. ఈ మేరకు సమచార శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక సవరణ జీవోను విడుదల చేశారు.
