Pawan Kalyan

Pawan Kalyan: తలపాగా ధరించి.. ‘చౌర్ సాహిబ్’ సేవలో పాల్గొన్న పవన్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల తొమ్మిదవ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘హింద్ దీ చాదర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ పర్యటన ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు అక్కడి నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ సిక్కు సంప్రదాయం ప్రకారం తలపాగా (దస్తార్) ధరించి, దర్బార్ సాహిబ్‌లో దైవదర్శనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Mantena: నాకు ప్రభుత్వం నుంచి ఏది వద్దు..

గురుద్వారాలో పవన్ కళ్యాణ్ అత్యంత భక్తిశ్రద్ధలతో ‘చౌర్ సాహిబ్’ సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు (అర్దాస్) నిర్వహించారు. ధర్మ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. గురుద్వారా కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్‌ను శాలువాతో సత్కరించి గౌరవించారు. ఈ పర్యటన నాందేడ్‌లోని తెలుగు వారితో పాటు సిక్కు సామాజిక వర్గంలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపింది.

దర్శనం తర్వాత పవన్ కళ్యాణ్ మోదీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన ‘హింద్ దీ చాదర్’ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ భారీ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా విచ్చేశారు. సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరైన ఈ సభలో అమిత్ షాతో కలిసి పవన్ వేదికను పంచుకున్నారు. 2026 గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు జరిగిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యతను చాటిచెప్పింది. గురువుల త్యాగనిరతిని కొనియాడుతూ సాగిన ఈ సభ విజయవంతంగా ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *