Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మహారాష్ట్రలోని నాందేడ్లో పర్యటిస్తున్నారు. సిక్కుల తొమ్మిదవ గురువు, ‘హింద్ ది చాదర్’గా పిలవబడే శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350వ షహీదీ సమాగమం (బలిదాన స్మరణోత్సవం) సందర్భంగా నిర్వహిస్తున్న ‘హింద్ ది చాదర్’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిక్కుల అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటైన తఖత్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ జీ గురుద్వారాను సందర్శిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటన వివరాల్లోకి వెళితే, ఆయన ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనమై, ఉదయం 9:45 గంటలకు నాందేడ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:20 గంటలకు శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకుంటారు. అక్కడ ఆయన సిక్కు సంప్రదాయం ప్రకారం తలపాగా (దస్తార్) ధరించి, చౌర్ సాహిబ్ సేవ, అర్దాస్ వంటి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
Also Read: Chandrababu Naidu: అమరావతిని ఎవరూ అడ్డుకోలేరు.. ప్రపంచమే మెచ్చేలా రాజధాని నిర్మాణం
ఈ వేడుకల సందర్భంగా గురుద్వారా కమిటీ పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా సత్కరించనుంది. మధ్యాహ్నం 2:10 గంటలకు శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350వ షహీదీ సమాగమంలో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు మోదీ మైదానంలో జరిగే ప్రధాన దర్బార్ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే సాయంత్రం 4:30 గంటలకు నాందేడ్ నుండి తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు కూడా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొంటుండటం విశేషం.
