KTR: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సిట్ (SIT) అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 7 గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు ఆయన నుంచి కీలక సమాచారాన్ని సేకరించి, వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం (SIB) కేంద్రంగా రాజకీయ నాయకులు, ప్రముఖుల ఫోన్లు అక్రమంగా ట్యాపింగ్ అయ్యాయనే ఆరోపణలపై 2024లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ను అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ అధికారి రాధాకిషన్రావుతో కేటీఆర్ను ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఈ దర్యాప్తులో ప్రస్తుతం వేగం పెరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ఈ కేసులోని అసలు నిజాలను బయటకు తీసే పనిలో ఉంది. ఈ విచారణ తర్వాత కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
