KTR: పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారని భావించామని కేటీఆర్ అన్నారు. కానీ ఓటమి భయంతో ప్రభుత్వం జిల్లా పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తోందని ఆరోపించారు. కొన్ని జిల్లాలను రద్దు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల సౌలభ్యం కోసం తమ ప్రభుత్వమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, “కార్తీక దీపం” సీరియల్ కూడా ముగిసింది కానీ ఈ రాజకీయ డ్రామా మాత్రం ముగియట్లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేతకాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, టీవీ సీరియల్ను తలపించేలా డ్రామాలు నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై స్పందిస్తూ, హరీష్ రావును ప్రశ్నించినట్టే తనను కూడా ప్రశ్నిస్తారని, తన ఫోన్ ట్యాప్ అవుతోందో లేదో సిట్ను అడుగుతానని అన్నారు. కేసు విచారణ ప్రారంభించి రెండేళ్లు అయినా అధికారిక ప్రకటనలు లేవని, లీకులు మాత్రమే వస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చే వరకు టైంపాస్ చేయడానికే విచారణకు పిలుస్తున్నారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులే బలయ్యారని, ముగ్గురు మంత్రుల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలయ్యారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను ఏసీబీ విచారణకు రెండు మూడు సార్లు, ఈడీ విచారణకు ఒకసారి వెళ్లానని చెప్పి, తమపై జరుగుతున్న విచారణలను రాజకీయ వేధింపులుగా అభివర్ణించారు.
