Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయానికి విచారణ కోసం హాజరయ్యారు. ఇటీవల ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేయడంతో, నిర్ణీత సమయానికి ఆయన అధికారుల ముందుకు వచ్చారు.
ఈ కేసులో ప్రధానంగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మద్యం పాలసీ తయారీలో మరియు నిధుల మళ్లింపులో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటనే కోణంలో అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ బృందం (SIT) ఆయనను విచారించగా, ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయసాయిరెడ్డి ఈ విచారణలో అధికారులకు ఏ విధమైన సమాచారం అందిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో జరిగిన సిట్ విచారణలో ఆయన కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఇప్పుడు ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసి, ఈ కుంభకోణంలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ విచారణ అనంతరం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
