Kerala:కేరళ రాష్ట్రంలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిపై వీడియో తీసి.. ఆయన మరణానికి కారకురాలైన ఇన్ఫ్లుయెన్సర్ షింజిత ముస్తఫాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఆ బస్సులో దీపక్ అనే వ్యక్తి అసభ్యంగా తాకాడంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది.
Kerala:ఇన్ఫ్లుయెన్సర్ షింజిత ముస్తఫా తీసిన వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో దీపక్ ఆత్మహత్య చేసుకోవడంపై.. ఈ సూసైడ్ కేసును కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నార్త్ జోన్ డీజీపీని కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు గురువారం (జనవరి 22) షింజిత ముస్తఫాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
Kerala:కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా గోవిందపురం గ్రామానికి చెందిన దీపక్ (42) అనే వ్యక్తి జనవరి 16న అక్కడి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. ఆయన బస్సులో నిల్చొని ప్రయాణిస్తుండగా, ఆయన మోచేయి వెనుకే నిల్చొని ఉన్న ఓ యువతిని తాకుతూ ఉన్న దృశ్యాన్ని మరో యువతి వీడియో తీసింది. ఇది అన్యమనస్కంగా జరిగిందా? లేక కావాలని జరిగిందా? అన్న విషయం తెలియదు.
Kerala:ఈ వీడియోను ఇన్ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. ఇది చూసిన దీపక్ అవాక్కవడంతోపాటు మనస్తాపానికి గురయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన అతని కుటుంబ సభ్యులు దీపక్ను ఓదార్చి ధైర్యం చెప్పారు. అయినా ఆ తర్వాత కొద్దిసేపటికే తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
Kerala:షింజిత ముస్తఫా పోస్టు చేసిన వీడియో కారణంగానే దీపక్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. దీపక్ కావాలని చేసింది కాదని, రద్దీ కారణంగా అతని చేయి తగిలి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కానీ, అది కావాలనే చేశాడని షింజిత చెప్పుకొచ్చింది. కానీ, ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని వివరణ ఇచ్చుకున్నది. కానీ, ఈ లోగా జరగకూడనిది జరిగిపోయింది.
