Tranfers: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్న తరుణంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో భారీగా బదిలీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారిని, అలాగే ఒకే ప్రాంతంలో మూడేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్న అధికారులను ఇతర ప్రాంతాలకు మార్చడం జరిగింది.
ఇది కూడా చదవండి: Teena Sravya: మేడారంలో కుక్కకు తులాభారం..నటి టీనా శ్రావ్య క్షమాపణ
ఈ బదిలీల్లో 21 మందిని ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చగా, మిగిలిన వారిని సాధారణ పరిపాలనలో భాగంగా బదిలీ చేశారు. విశేషమేమిటంటే, ఈ క్రమంలో ఐదుగురు అధికారులకు పదోన్నతులు (ప్రమోషన్లు) కల్పిస్తూ కొత్త బాధ్యతలు అప్పగించారు.
ముఖ్యంగా ఆదిలాబాద్, రామగుండం, మంచిర్యాల, హుజురాబాద్ వంటి కీలక ప్రాంతాల్లో కొత్త కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా విధులకు ఆటంకం కలిగించినా లేదా ఆదేశాలను పాటించకపోయినా వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఎన్నికల ముందస్తు సన్నాహకాల్లో భాగంగా జరిగిన ఈ మార్పులు ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
