Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భద్రతా సిబ్బందికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ముంబైలోని జుహూ ప్రాంతంలో సోమవారం ఉదయం ఆయన సెక్యూరిటీ టీమ్ ప్రయాణిస్తున్న కారును ఒక వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో అక్షయ్ కుమార్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 9 గంటల సమయంలో అక్షయ్ కుమార్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది తమ కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రక్కు ఢీకొట్టిన ధాటికి కారులో ఉన్న ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు వారిని చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
అక్షయ్ కుమార్కు ఉన్న ప్రాణహాని మరియు గతంలో వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. దీనికి తోడు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ టీమ్ కూడా ఎప్పుడూ ఆయన వెంటే ఉంటుంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
