Green Ammonia Project: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి ‘హరిత ఇంధన హబ్’గా (Global Green Energy Hub) మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు పడింది. శనివారం (జనవరి 17, 2026) కాకినాడలో ఏర్పాటు కానున్న దేశంలోనే మొదటి, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. గ్రీన్కో గ్రూప్కు చెందిన ‘ఏఎం గ్రీన్’ (AM Green) సంస్థ సుమారు రూ. 18,000 కోట్ల (2 బిలియన్ డాలర్ల) భారీ పెట్టుబడితో ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్ను నిర్మిస్తోంది. మొత్తం 495 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 8,000 మందికి ఉపాధి లభించనుంది.
కాలుష్య రహిత ఇంధనం – గ్రీన్ అమ్మోనియా విశేషాలు సాధారణ అమ్మోనియా తయారీలో బొగ్గు లేదా సహజ వాయువును వాడటం వల్ల పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి. కానీ, ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ పూర్తిగా సౌర, పవన విద్యుత్ (Renewable Energy) వంటి పునరుత్పాదక ఇంధన వనరులతో పనిచేస్తుంది. ఇందులో నీటిని విడగొట్టి హైడ్రోజన్ను తయారు చేసేందుకు 1,950 మెగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ను ఉపయోగిస్తారు. గాలిలోని నైట్రోజన్ను ఈ గ్రీన్ హైడ్రోజన్తో కలపడం ద్వారా గ్రీన్ అమ్మోనియా తయారవుతుంది. దీనివల్ల కాలుష్యం ఏమాత్రం ఉండదు. అందుకే దీనిని ‘భవిష్యత్తు ఇంధనం’ అని పిలుస్తారు.
Also Read: Ramchandra rao: బీఆర్ఎస్ పార్టీ ముక్కలవడం ఖాయం
ప్రపంచ దేశాలకు ఏపీ నుండి ఎగుమతులు కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమ్మోనియాను జర్మనీకి చెందిన ‘యూనిపర్’ సంస్థతో పాటు జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు. మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్ జీఐసీ వంటి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. 2028 నాటికి ఏడాదికి 5 లక్షల టన్నులు, 2030 నాటికి పూర్తిస్థాయిలో 15 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం పరిశ్రమ స్థాపనే కాకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధి బాటలో నడిపించే ‘గేమ్ చేంజర్’గా మారుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
