Cp sajjanar: సోషల్ మీడియా మీద లక్కీ డ్రా పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజలను ఆశపెట్టి మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రీల్స్లో బిల్డప్… రియాల్టీలో ఫ్రాడ్” అంటూ సజ్జనార్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామని చెప్పి అమాయకుల నుండి డబ్బులు దోచుకుంటున్నారనే ఫిర్యాదులు పోలీసులకు చేరుతున్నాయని వెల్లడించారు. ప్రజలు ఇలాంటి ప్రకటనలను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు.
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల మీద చర్యలు తీసుకున్న తర్వాత కొందరు కొత్తగా లక్కీ డ్రాల పేరుతో దందా మొదలుపెట్టారని సజ్జనార్ తెలిపారు. సోషల్ మీడియా పాప్యులారిటీని ఉపయోగించి ప్రజల నమ్మకంతో ఆడుకుంటున్నారని తీవ్రమైన విమర్శలు చేశారు.
“ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్–1978” ప్రకారం ఈ రకమైన మోసాలు చట్ట విరుద్ధమని పోలీసులు చెప్పారు. లక్కీ డ్రాల పేరుతో మోసం చేస్తే సెలబ్రిటీలు అయినా, సోషల్ మీడియా స్టార్లు అయినా కఠినంగా కేసులు నమోదు చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.
