CM Chandrababu: నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సొంతూరికి రావడం అంటే కేవలం పండుగ జరుపుకోవడం మాత్రమే కాదని, మన మూలాలను గౌరవించుకోవడమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సంక్రాంతి రోజున పెద్దలను తలచుకోవడం మన సంప్రదాయమని చెబుతూ, ఆయన తన తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించి, గ్రామ దేవత నాగాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, మనవడు దేవాన్ష్, నటుడు నారా రోహిత్ తదితరులు పాల్గొని పండుగ సందడిని పంచారు.
పండుగ వేదికగా రాష్ట్ర అభివృద్ధిపై తన విజన్ను పంచుకున్న చంద్రబాబు, 2047 నాటికి ‘స్వర్ణాంధ్ర’ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. సమాజంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు ‘పీ-4’ విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సంపద పెరగడమే కాకుండా, సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలు చేతికి వచ్చే ఈ శుభసమయంలో ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతిలో భాగమని, అందుకే పశువుల పండుగకు అంతటి ప్రాముఖ్యత ఉందని వివరించారు.
Also Read: Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’ కు సుప్రీం కోర్టు బిగ్ షాక్..!
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ఈ ఏడాది నుండి ‘సంజీవని’ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేసి, మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తామని, ‘కుసుమ్’ పథకం కింద వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మిగులు విద్యుత్తుతో వాహనాలను ఛార్జింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తామని, ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
