Ponnam Prabhakar: ఫేక్ న్యూస్ ఏస్తే చట్టపరమైన చర్యలు

Ponnam Prabhakar: మహిళా ఐఏఎస్ అధికారులను అవమానించే విధంగా ఇటీవల ఒక టీవీ ఛానల్‌లో ప్రసారమైన కథనం వివాదానికి దారితీసిన నేపథ్యంలో, ఆ విషయంపై తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం చేస్తున్న వారికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహిళా అధికారులను కించపరిచే చర్యలు ఏవీ సహించబోవని మంత్రి హెచ్చరించారు.

కరీంనగర్‌లోని గిద్దె పెరుమాండ్ల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి, అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు అంచెలంచెలుగా అమలవుతున్నాయని ఆయన తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దృఢమైన బలం చాటిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధిక స్థానాలు సాధిస్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని మంత్రి విమర్శించారు. అప్పుల భారంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయకుండా అమలు చేస్తోందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా ప్రజలకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ క్యాంటీన్లు వంటి పథకాలను ముందుకు తీసుకెళ్తున్నామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బలహీనపరచడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ, ప్రజా సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిబద్ధతను మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *