IND vs NZ

IND vs NZ: కేఎల్ రాహుల్ సెంచరీ వృథా.. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి!

IND vs NZ: రాజ్‌కోట్ వేదికగా భారత్‌తో జరిగిన ఉత్కంఠభరిత రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన పర్యాటక జట్టు 7 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేయడమే కాకుండా, సిరీస్ విజేత ఎవరో తేల్చే ఆఖరి పోరుకు వేదికను సిద్ధం చేసింది.

కేఎల్ రాహుల్ సెంచరీ వృథా.. భారత్ భారీ స్కోరు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ధశతకంతో శుభారంభం అందించినప్పటికీ, రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (23), శ్రేయస్ అయ్యర్ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో భారత్ ఒకానొక దశలో కష్టాల్లో పడింది. ఈ తరుణంలో కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన వన్డే కెరీర్‌లో 8వ సెంచరీని నమోదు చేస్తూ 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. రవీంద్ర జడేజా (27), నితీష్ రెడ్డి (20) అతనికి సహకరించారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లతో భారత్‌ను కట్టడి చేశాడు.

Also Read: WPL 2026: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర

మిచెల్ ఊచకోత.. కివీస్ అద్భుత విజయం
285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు ఆరంభంలోనే షాక్ ఇచ్చారు. ఓపెనర్లు డేవాన్ కాన్వే (16), హెన్రీ నికోల్స్ (10) 50 పరుగుల లోపే నిష్క్రమించారు. అయితే, ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్, విల్ యంగ్ భారత బౌలర్లను ఆడుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ నుంచి దూరం చేశారు.

డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి 117 బంతుల్లో 131 పరుగులు (11 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. విల్ యంగ్ (87) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (32*) మెరుపులు మెరిపించడంతో కివీస్ 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

తొలి వన్డేలో ఆకట్టుకున్న భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 82 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టినప్పటికీ కివీస్ జోరును అడ్డుకోలేకపోయారు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కావడంతో, జనవరి 18న ఇండోర్ వేదికగా జరగనున్న మూడో వన్డే ‘సిరీస్ డిసైడర్’గా మారింది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టునే సిరీస్ ట్రోఫీ వరిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *