Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి (86) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్ అమీర్పేటలోని తన నివాసంలో కన్నుమూశారు.
నిరాడంబర జీవితం
శివలక్ష్మి గారు నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారు. రోశయ్య గారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక పదవులను అధిష్టించారు. ఆయన మంత్రిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా, చివరకు తమిళనాడు గవర్నర్గా వెళ్లినా.. శివలక్ష్మి గారు ఎప్పుడూ తెరవెనుకే ఉండి కుటుంబ బాధ్యతలను చక్కదిద్దేవారు. రాజకీయ ఆడంబరాలకు దూరంగా ఉంటూ, రోశయ్య విజయాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.
రాజకీయ ప్రముఖుల సంతాపం
2021 డిసెంబర్లో రోశయ్య మరణించిన తర్వాత, శివలక్ష్మి గారు అమీర్పేటలోని నివాసంలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. ఆమె మరణవార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె నివాసానికి చేరుకుంటున్న నేతలు శివలక్ష్మి గారి భౌతికకాయానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
