Hyderabad: హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి నిల్వలను కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. సాధారణంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో అధికారులకు అనుమానం రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఖతార్ దేశం నుండి వచ్చిన ఒక విమానంలో ప్రయాణికులు డ్రగ్స్ను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల వద్ద ఉన్న బ్యాగులను సోదా చేయగా, అందులో 14 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు 14 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రకమైన గంజాయి అత్యంత ఖరీదైనది కావడంతో అధికారులు విస్తుపోయారు.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అసలు వీరికి ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్లో ఎవరికి అందించాలి? దీని వెనుక ఉన్న పెద్ద ముఠా ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్ కట్టడికి అధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, స్మగ్లర్లు కొత్త కొత్త దారుల్లో వీటిని తరలించడం ఆందోళన కలిగిస్తోంది.
