Jana nayagan: తమిళ సూపర్స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన, సినిమాల నుంచి వైదొలుగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమైంది.
ఈ నెల జనవరి 9న సినిమా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో రిలీజ్పై అనుమానాలు నెలకొన్నాయి. విడుదలకు కేవలం మూడు రోజులే ఉండటంతో సర్టిఫికెట్ రాకపోవడం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ అభిమానులు తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు.
డిసెంబర్ 18న చిత్రాన్ని సెన్సార్ బోర్డుకు సమర్పించారు. బోర్డు కొన్ని మైనర్ కట్స్, డైలాగ్ మ్యూట్స్ సూచించగా, నిర్మాతలు వాటిని వెంటనే అమలు చేసి మళ్లీ రీసబ్మిట్ చేశారు. అయినప్పటికీ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం జరుగుతోంది.
ఈ ఆలస్యం వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ, “కొన్ని గంటల్లో సర్టిఫికెట్ రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటాం” అంటూ హెచ్చరించారు.
సెన్సార్ సర్టిఫికెట్ లేకపోవడంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ నిలిచిపోయాయి. అయితే కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ మార్కెట్లలో బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ప్రీ-సేల్స్ రూ.35 కోట్లు దాటినట్లు సమాచారం.
సర్టిఫికెట్ లేకపోతే థియేటర్లలో షోలు వేయడం సాధ్యం కాకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసి సెన్సార్ సర్టిఫికెట్ తక్షణమే ఇవ్వాలని కోర్టును కోరింది.
కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తే వెంటనే బుకింగ్స్ పునఃప్రారంభమై, నిర్ణయించిన తేదీనే సినిమా విడుదలయ్యే అవకాశముందని చిత్ర బృందం ఆశిస్తోంది.
