IND-W vs SL-W: శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇప్పటికే 4-0తో కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు, నేడు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఆఖరి పోరులో క్లీన్స్వీప్పై కన్నేసింది. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన టీమ్ ఇండియా, 2025 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించాలని పట్టుదలతో ఉంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ ఐదో టీ20లో కూడా గెలిచి సిరీస్ను 5-0తో పూర్తి చేయాలని హర్మన్ప్రీత్ సేన భావిస్తోంది.
ఈ సిరీస్లో భారత బ్యాటర్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా షెఫాలీ వర్మ వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది విధ్వంసం సృష్టిస్తుండగా, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన గత మ్యాచ్లో 48 బంతుల్లోనే 80 పరుగులు చేసి తన ఫామ్ను నిరూపించుకుంది. వీరిద్దరూ నాలుగో టీ20లో 162 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్ టీ20 చరిత్రలోనే అత్యధిక స్కోరు (221/2) సాధించడంలో కీలక పాత్ర పోషించారు. రిచా ఘోష్ మెరుపులు, దీప్తి శర్మ నిలకడైన ప్రదర్శన జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి.
Also Read: World Rapid ChampionShip: ఆరోసారి ప్రపంచ రాపిడ్ టైటిల్ కైవసం
మరోవైపు శ్రీలంక జట్టు కనీసం ఈ చివరి మ్యాచ్లోనైనా గెలిచి తమ పరువు నిలుపుకోవాలని చూస్తోంది. గత మ్యాచ్లో శ్రీలంక జట్టు కూడా 191 పరుగులు చేసి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. చమరి ఆటపట్టు సారథ్యంలోని లంక జట్టు భారత బౌలింగ్, బ్యాటింగ్ పటిమను ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది. భారత బౌలర్లలో రేణుక సింగ్, దీప్తి శర్మలతో పాటు కొత్తగా జట్టులోకి వచ్చిన స్పిన్నర్ వైష్ణవి శర్మ ఆకట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్లో 17 ఏళ్ల యువ బ్యాటర్ కమలి అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ హై-వోల్టేజ్ పోరును స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియో హాట్స్టార్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
