Hyderabad

Hyderabad: హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్.. నగరంలో మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు!

Hyderabad: కొత్త ఏడాది వేడుకలు వస్తున్నాయంటే చాలు భాగ్యనగరంలో సందడి మామూలుగా ఉండదు. అయితే, ఈ ఆనందం విషాదంగా మారకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్పుడే రంగంలోకి దిగారు. డిసెంబర్ 31 వరకు నగరం అంతటా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. వేడుకల పేరుతో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వారు స్పష్టం చేస్తున్నారు.

తనిఖీలు మొదలుపెట్టిన తొలి రోజే ఏకంగా 304 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. నిబంధనలు ఉల్లంఘించిన వీరిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారి 304 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన జంక్షన్లు, పబ్బులు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. తాగి వాహనం నడిపి పట్టుబడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నూతన సంవత్సర వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని, కానీ అదే సమయంలో బాధ్యతను మర్చిపోవద్దని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మద్యం సేవించిన వారు డ్రైవింగ్ చేయకుండా క్యాబ్‌లు లేదా డ్రైవర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేయవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *