Kamareddy: కామారెడ్డి జిల్లాలో మానవత్వం మంటగలిసే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు గ్రామాల్లో సుమారు 600కు పైగా వీధి కుక్కలను దారుణంగా చంపేశారు. పాల్వంచ, ఫరీద్పేట్, బండరామేశ్వర్పల్లి, భవానీపేట, వాడి గ్రామాల్లో ఈ దారుణం జరిగింది. కుక్కల బెడద ఎక్కువగా ఉందనే నెపంతో ఇలా సామూహికంగా వాటిని అంతం చేయడం ఇప్పుడు స్థానికంగా పెద్ద కలకలం రేపుతోంది.
ఈ దారుణానికి సంబంధించి గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల పైనే ఆరోపణలు వస్తున్నాయి. వారి ఆధ్వర్యంలోనే కుక్కలకు విషం పెట్టి చంపించారని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సమస్య ఉంటే వాటికి సంతానోత్పత్తి నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి కానీ, ఇలా ప్రాణాలు తీయడం చట్టవిరుద్ధమని వారు మండిపడుతున్నారు.
విషయం తెలుసుకున్న జంతు హక్కుల కార్యకర్తలు వెంటనే స్పందించారు. మూల రజని, అనిత, భాను ప్రకాష్, గోవర్ధన్ బృందం మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. కుక్కలను ఎక్కడెక్కడ పాతిపెట్టారో ఆ ప్రాంతాలను గుర్తించి పరిశీలించారు. మూగజీవులను పొట్టనబెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు మరియు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
