Eluru: ఏలూరు సుస్మితా డయాగ్నొస్టిక్ సెంటర్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. సాధారణంగా ఎమ్మారైకి వచ్చిన వ్యక్తుల వద్ద ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా చూస్తారు సిబ్బంది. సదరు వ్యక్తి ఒంటిపై ఏదైనా మెటల్కు సంబంధించిన వస్తువులు ఉంటే రేడియేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఎమ్మారై కోసం వచ్చిన వారి ఒంటిపై ఎలాంటి వస్తువులు లేకుండా చూస్తారు డయోగ్నొస్టిక్ సిబ్బంది. కానీ ఏలూరులోని సుస్మితా డయోగ్నొస్టిక్ సెంటర్లో మహిళ పట్ల సిబ్బంది ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏలూరు నగరంలోని రామచంద్రరావుపేటలో సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం ఏలూరు రూరల్ మండలం ప్రతికోళ్లంకకు చెందిన రామతులసమ్మ అనే మహిళ వచ్చింది. రామతులసమ్మ గత కొన్నిరోజులుగా ఆయుష్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు.అయితే ఎమ్ఆర్ఐ స్కాన్ తీయించుకోవాలని అక్కడి డాక్టర్ సూచించడంతో.. రామతులసమ్మ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం సుస్మిత డయాగ్నోస్టిక్ కేంద్రానికి వచ్చారు. కానీ.. డయాగ్నోస్టిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
రామతులసమ్మకు గతంలో పేస్ మేకర్ అమర్చారు. అయితే ఎమ్ఆర్ఐ స్కానింగ్ సమయంలో మెటల్ డిటెక్టర్ సాయంతో రామతులసమ్మను చెక్ చేయలేదు డయాగ్నోస్టిక్ సిబ్బంది. నేరుగా స్కానింగ్ మెషీన్లోకి పంపించారు. అయితే మెషీన్లోని వెళ్లిన వెంటనే ఎమ్ఆర్ఐ స్కాన్ రేడియేషన్ ప్రభావంతో రామతులసమ్మ విలవిల్లాడిపోయారు. మెషీన్లోనే కొట్టుమిట్టాడుతూ కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: Garlic Rice: రాత్రి భోజనంలో గార్లిక్ రైస్.. ఆ కిక్కే వేరప్పా.. రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు !
ఎమ్ఆర్ఐ స్కానింగ్ రేడియేషన్ కారణంగా పేస్ మేకర్ ఊడిపోయి రామతులసమ్మ మరణించినట్లు తెలుస్తోంది. కానీ కార్డియాక్ అరెస్ట్ కారణంగా రామతులసమ్మ చనిపోయినట్లు స్కానింగ్ సెంటర్ సిబ్బంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రామతులసమ్మ భర్త కోటేశ్వరరావు డయాగ్నోస్టిక్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. స్కానింగ్ మెషీన్లో తన భార్య ఉక్కిబిక్కిరి అవుతున్న విషయాన్ని గుర్తించి.. స్కానింగ్ ఆపాలని సిబ్బందిని కోరినట్లు ఆయన చెప్తున్నారు. కానీ డయాగ్నోస్టిక్ సిబ్బంది పట్టించుకోలేదని… చివరకు తన భార్య రేడియేషన్ తట్టుకోలేక చనిపోయిందంటూ ఆయన వాపోయారు. డయాగ్నోస్టిక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు.
సాధారణంగా ఎమ్ఆర్ఐ స్కానింగ్ కోసం వచ్చిన వారి శరీరంపై ఎలాంటి మెటల్ వస్తువులు లేకుండా సిబ్బంది జాగ్రత్త పడతారు. అలాగే శరీరంలో ఏవైనా మెటల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చారా అనే విషయాల గురించి వారిని అడిగి వివరాలు తెలుసుకుంటారు. మెటల్ వస్తువులు ఉంటే ఎమ్ఆర్ఐ స్కానింగ్ రేడియేషన్ కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఏలూరు ఘటనలో డయాగ్నోస్టిక్ సిబ్బంది మెటల్ డిటెక్టర్ సాయంతో తనిఖీ చేయకపోవటంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
