Khammam: ఖమ్మం నగరంలో శుక్రవారం రాత్రి ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. కస్బాబజార్ ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్ పక్కనే ఉన్న సందులో ఒక మహిళ రక్తపు మడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఖమ్మం ఒకటో పట్టణ ఎస్సై మౌలానా తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, మరణించిన మహిళ వివరాలను సేకరించారు.
మృతురాలిని భద్రాచలానికి చెందిన ప్రమీల (35)గా పోలీసులు గుర్తించారు. ఆమె భర్త భద్రాచలంలో ఆర్.ఎం.పి డాక్టరుగా పనిచేస్తున్నారు. అయితే, వీరికి పిల్లలు కలగలేదనే కారణంతో గత కొంతకాలంగా భార్యాభర్తలు ఇద్దరూ దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రమీలకు ఆమె భర్త స్నేహితుడైన శ్రావణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే గత కొంతకాలంగా శ్రావణ్ ఆమెను వేధిస్తుండటంతో, నెల రోజుల క్రితమే భద్రాచలంలో అతనిపై కేసు కూడా నమోదైంది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. తన మాట వినలేదనే కోపంతో పాటు, తనపై కేసు పెట్టిందన్న కక్షతోనే శ్రావణ్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
