Warangal:నీకు నచ్చని వ్యక్తా? పెట్టేస్తా కేసు.. పట్టేస్తా నగదు.. ఇదీ గతంలో వరంగల్ మట్టెవాడ పోలీస్స్టేషన్లో పనిచేసిన పోలీస్ అధికారుల తీరు. ఈ అధికారులతో దోస్తానా ఉంటే చాలు.. పడని వ్యక్తులపై ఇట్టే కేసులు పెట్టేయొచ్చు అంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎంతో మందిపై అక్రమ కేసుల్లో ఇరికించి నగదు లాగేశారు. అయితే ఓ వ్యక్తి తనను అక్రమంగా అరెస్టు చేసి, కేసులో ఇరికించారని ఆధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించడంతో వారి బాగోతం బయటపడింది. ఆ పోలీసు అధికారులపై వేటు పడింది.
Warangal:వరంగల్ పోలీస్ డివిజన్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో గతంలో తప్పుడు కేసులు నమోదు చేసి పలువురిని ఇబ్బందులకు గురిచేశారంటూ నిర్ధారణ కావడంతో అప్పటి ఏసీపీ నందిరాం నాయక్, మట్టెవాడ ఇన్స్పెక్టర్ టీ.గోపిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ను సస్పెండ్ చేస్తూ డీజీపీ శివధర్రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు.
Warangal:వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యక్తిపై కక్ష సాధింపులో భాగంగా గతంలో ఇదే పోలీస్ అధికారులు ఓ కేసు నమోదు చేశారు. అతను ఓ ఇంటిలోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డాడంటూ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో నిరుడు తప్పుడు కేసును నమోదు చేసి రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి పసిగట్టి జాగ్రత్తపడ్డాడు.
Warangal:ఈ విషయం తెలిసిన సదరు వ్యక్తి తనపై తప్పుడు కేసు పెట్టారని హైకోర్టును ఆశ్రయించాడు. ఘటన జరిగిందంటూ పోలీసులు పేర్కొన్న సమయంలో తాను అక్కడ లేనంటూ, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను ఆ బాధితుడు సమర్పించాడు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారించింది. సమగ్ర విచారణ జరపాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులను ఆదేశించింది.
Warangal:కోర్టు ఆదేశాలతో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఒక్క తప్పుడు కేసే కాకుండా సుమారు 15 వరకు ఇలాంటి తప్పుడు కేసులను మట్టెవాడ పోలీస్ అధికారులు నమోదు చేశారని గుర్తించారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా డీజీపీ ఆ ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
