Vemula Prashant: సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో జరిగిన రూ.1,600 కోట్ల అవినీతిని బయటపెట్టినందుకే మాజీ మంత్రి హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని SIT నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని అన్నారు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కావాలనే హరీశ్ రావును వేధిస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ వేదికగా, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ-రేస్, విద్యుత్ అంశాల పేరుతో విచారణలంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ‘దండుపాళ్యం ముఠా’ నడుపుతోందని, ఆ ముఠాకు నాయకుడు సీఎం రేవంత్ రెడ్డేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సివిల్ సప్లయ్, సమ్మక్క సారలమ్మ టెండర్లు, పారిశ్రామిక భూముల కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన, రూ.1,600 కోట్ల బొగ్గు గనుల కాంట్రాక్ట్ విషయంలో సీఎం, మంత్రుల మధ్యే విభేదాలు వచ్చాయని వెల్లడించారు. రోజుకొక కుంభకోణంతో ప్రభుత్వం నడుస్తోందని విమర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ అవినీతిపై కూడా SIT వేయాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు ప్రజల కోసం పోరాడే నాయకుడని, ఆయనకు తెలంగాణ సమాజం మొత్తం మద్దతుగా ఉందని స్పష్టం చేశారు.
