Power Of One Vote: సర్కార్’ సినిమాలో “నీ ఒక్క ఓటుతో ఏం చేయగలవు?” అంటే.. “ఒక్క ఓటు చాలు.. రాజకీయాలనే మార్చేయొచ్చు” అంటాడు విజయ్. ఇప్పుడు ఇదే నిజంగా జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తిరుపత్తూరు అభ్యర్థి కేవలం ఒక్క ఓటుతోనే గెలిచాడు. ప్రతి ఒక్క ఓటు ఎంతో ముఖ్యమని ఈ గెలుపు నిరూపించింది. మస్కట్ నుండి వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్న ఓ అభిమాని వల్ల ఈ విజయం సాధ్యమైంది.
ఎన్నికల్లో అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజయ్ ఇచ్చిన పిలుపుతో, విదేశాలలో ఉన్న తమిళనాడు ప్రజలు మరియు విజయ్ అభిమానులు తమ ఓటు వేయడానికి తమిళనాడుకు వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదయ్యేలా చేశారు.
ఈ ఎన్నికల్లో తిరుపత్తూరు నియోజకవర్గం తమిళగ వెట్రి కజగం (TVK) అభ్యర్థి శీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో డీఎంకే అభ్యర్థిపై సంచలన విజయం సాధించారు. ఆ ఒక్క ఓటు వేసింది కూడా విజయ్ అభిమానే కావడం విశేషం.
ఆ ఓటు వెనుక ఉన్న కథ ఇదీ.. విజయ్ అభిమాని అయిన ఒక వ్యక్తి మస్కట్లో ఉంటున్నాడు. విజయ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి, ఎలాగైనా తన ఓటు వృధా చేయకుండా టీవీకేకే వేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా మస్కట్ నుండి వచ్చి మరీ ఓటు వేశాడు. కానీ, తాను వేసిన ఆ ఒక్క ఓటుతోనే తన నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి గెలుస్తాడని అతడు ఊహించలేదు.
