TTD

TTD Vaikuntha Darshan: వైకుంఠ ద్వార దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం..

TTD Vaikuntha Darshan: తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఈ ఏడాది ప్రత్యేకమైన అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ప్రతి సంవత్సరం ఒక్కరోజే జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు, ఈసారి భక్తుల తరలివచ్చే భారీ సంఖ్యను దృష్టిలో పెట్టుకొని పది రోజుల పాటు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వారం భక్తుల కోసం తెరుచుకుని ఉండనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, ఈసారి సాధారణ భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం విశేషం.

మొత్తం 182 గంటల దర్శన సమయం ఉండగా, అందులో 164 గంటలు పూర్తిగా సాధారణ భక్తుల కోసం మాత్రమే కేటాయించడం ఈసారి టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి. వైకుంఠ దర్శనాల మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో రూ.300 దర్శనం, శ్రీవాణి దర్శనం పూర్తిగా రద్దు చేయబడింది. ఈ తేదీల్లో భక్తులకు టికెట్లు ఈ–డిప్ లాక్కీ డిప్ విధానంలో కేటాయించబడతాయి. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వబడగా, డిసెంబర్ 2న లాటరీ విధానంలో అదృష్టం కలిసిన వారికి దర్శన టోకెన్లు అందుబాటులోకి రానున్నాయి.

జనవరి 2 నుంచి 8 వరకు పరిస్థితి కొంత మారుతుంది. ఈ రోజుల్లో రోజుకు 15,000 రూ.300 దర్శన టికెట్లు, 1,000 శ్రీవాణి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ సిస్టమ్ ద్వారా టికెట్లు పూర్తిగా పారదర్శకంగా జారీ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. స్థానికులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. తిరుమల–తిరుపతి ప్రాంతానికి చెందిన భక్తుల కోసం జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకెన్లు ప్రత్యేకంగా కేటాయించారు.

ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలకు వీఐపీ బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనం వంటి సౌకర్యాలు ఏడు రోజులపాటు రద్దు చేయబడడం గమనార్హం. అత్యవసర సందర్భాల్లో మాత్రమే ప్రముఖులకు దర్శన అనుమతి ఇచ్చే అవకాశం పరిశీలిస్తామని టీటీడీ తెలిపింది. అలాగే సాధారణంగా క్యూలైన్‌లో నిలబడి వచ్చే భక్తులకు కూడా వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతి ఏడాది వైకుంఠ దర్శనాలకు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చే సంప్రదాయం ఉంది. ఈసారి పది రోజుల పాటు దర్శనాలు ఇచ్చే అవకాశం ఉండటంతో మరింత భారీ రద్దీ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తుగా క్యూలైన్ నిర్వహణ, భద్రత, శానిటేషన్, త్రాగునీరు, వైద్యం, వసతి వంటి అన్ని ఏర్పాట్లు టీటీడీ ఇప్పటికే ముమ్మరం చేసింది.

వైకుంఠ ద్వార దర్శనాలు ప్రతి భక్తుడికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిందని, ఈసారి టీటీడీ తీసుకున్న నిర్ణయాలు భక్తులకు మరింత సౌకర్యం కలిగిస్తాయని అధికారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది భక్తులకు నిజంగా ఇది గొప్ప శుభవార్తగానే నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *