Trump: ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. టెహ్రాన్ మరోసారి అణ్వాయుధాల దిశగా అడుగులు వేస్తే తీవ్రమైన పరిణామాలు తప్పవని, అవసరమైతే దాడులకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్కు మద్దతుగా ఉన్న సాయుధ సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల ఇజ్రాయెల్ వాయుసేన దక్షిణ లెబనాన్లో జరిపిన దాడిలో అల్ సాదిక్ కరెన్సీ ఎక్స్చేంజ్ అధిపతి అబ్దుల్లా బక్రి హతమయ్యారు. ఖుద్స్ ఫోర్స్ నుంచి హెజ్బొల్లాకు నిధులు పంపిణీ చేసే వ్యవహారంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. దీంతో ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్పై ఒత్తిడిని మరింత పెంచేలా ఉన్నాయి.
“అణు కేంద్రాల ధ్వంసం – నా గౌరవం” అంటూ ట్రంప్ పోస్ట్
ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ యుద్ధం ఆగాలని కోరుతున్నాయి. కానీ అణు కేంద్రాలు ధ్వంసం చేయడం నాకు గౌరవంగా అనిపించింది. ఆ తర్వాతే యుద్ధాన్ని ఆపాను” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా వైఖరిని మరోసారి స్పష్టంగా చూపుతున్నాయి.
పుతిన్ సాయాన్ని తిరస్కరించా: ట్రంప్
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్యవర్తిత్వం చేయాలని ప్రతిపాదించారని, అయితే తాను ఆ సాయాన్ని సున్నితంగా తిరస్కరించానని ట్రంప్ తెలిపారు. ‘‘ఇరాన్ విషయంలో మీ సహాయం అవసరం లేదు, రష్యా విషయాల్లోనే మీ సహాయం అవసరం’’ అని తాను పుతిన్కు చెప్పానని వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలు ట్రంప్ ‘ఎయిర్ఫోర్స్ వన్’ విమానంలో జర్నలిస్టులతో పంచుకున్నారు. త్వరలో నెదర్లాండ్స్లో ప్రారంభం కానున్న నాటో సదస్సులో పాల్గొననున్న సందర్భంగా ఆయన ఈ విషయాలను తెలిపారు.
జెలెన్స్కీతో భేటీపై సూచన
నాటో సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మూడు సంవత్సరాలుగా కొనసాగుతుండగా, ఈ సంక్షోభానికి త్వరలో ముగింపు చూపించేందుకు తనవంతుగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. గత వారం రోజుల్లోనే దాదాపు 6,000 మంది సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.

