Pakistan: పాకిస్థాన్లో మరోసారి రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ నగరానికి సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడగా, అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదం లాహోర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేక్పురా జిల్లా – కాలా షా కాకు ప్రాంతంలో చోటుచేసుకుంది. రైలు లాహోర్ నుంచి రావల్పిండికి బయలుదేరిన కేవలం 30 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. పది బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: AP News: ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు ఇది పండుగే పండుగ!
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొని గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన పాకిస్థాన్ రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసీ, రైల్వే సీఈఓ, డివిజనల్ సూపరింటెండెంట్లను సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదంపై ఏడు రోజుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు నివేదిక అందించాలంటూ సూచించారు.
15 రోజుల్లో మూడో రైలు ప్రమాదం
ఇది గత 15 రోజుల వ్యవధిలో పాకిస్థాన్లో జరిగిన మూడవ రైలు ప్రమాదం కావడం గమనార్హం.
-
జూలై 28న క్వెట్టాకు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ లో పేలుడు చోటుచేసుకొని మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
-
జూలై 17న సింధ్ రాష్ట్రంలోని జకోబాబాద్ వద్ద కూడా వరుస పేలుళ్లతో జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది.
ఈ ఘటనలతో రైలు భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
