Crime News: సమాజంలో ఆడవాళ్లకి ఎలాగో సేఫ్టీ లేదు.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇంట్లో కూడా ఆడవాళ్లకి రక్షణ లేదని తెలుస్తోంది. కన్న బిడ్డలాగా చూసుకోవాల్సిన సొంత బాబాయ్కి కామంతో కళ్లుమూసుకుపోయి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలియడంతో తల్లి హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. ఘటన తిరుపతిలో జరగడంతో కేసును ఈస్ట్ పీఎస్కు బదిలీ చేశారు.
బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యం
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలికకు ఏప్రిల్ నెలలో కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో తిరుపతిలో ఉన్న తన పిన్ని ఇంటికి వెళ్లింది. పిన్ని భర్త రామమూర్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వరసకు కూతురు అని కూడా మర్చిపోయి ఎలాగైనా బాలికను లొంగదీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయనకు బాలిక మొబైల్లో ప్రైవేట్ ఫొటోస్ కనిపించడంతో.. “సోషల్ మీడియాలో వీటిని పెడతాను” అంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. చివరికి పలుమార్లు అత్యాచారం చేశాడు.
తల్లి నిలదీయడంతో వెలుగులోకి..
ఎగ్జామ్స్ ఉండటంతో హైదరాబాద్ వచ్చిన బాలిక.. ఎప్పుడూ హుషారుగా ఉండే ఆమె ప్రతిరోజూ దిగులుగా ఉండటంతో అనుమానం వచ్చి తల్లి గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. ఇలా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన తిరుపతిలో జరగడంతో ‘జీరో ఎఫ్ఐఆర్’ (07/2026) నమోదు చేశారు.
ప్రస్తుతం నిందితుడు రామమూర్తి పారిపోగా.. పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతి పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం కింద కేసు నమోదు చేశారు.
