Telangana: తాను కొన్న కొత్తకారును స్నేహితులకు చూపించి వారితో సరదాగా గడపాలనుకున్నాడు. కానీ అదే వారి చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేకపోయాడు. సరదాగా కారులో వెళ్లిన ముగ్గురు స్నేహితుల ప్రయాణం విషాదాంతమైంది.
హైదరాబాద్ బహదూర్పుర హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన రితేశ్ అగర్వాల్ ఇటీవల కొత్త కారు కొన్నాడు. అయితే తన తండ్రి కొన్న కారును తన స్నేహితులకు చూపించాలనుకున్న ఆయన కుమారుడు దీపేశ్ అగర్వాల్ బయటకు వచ్చాడు. అనుకున్నట్లే స్నేహితులు కార్వాన్ విజయనగర్కాలనీకి చెందిన సంచయ్ మల్పానీ, ప్రగతినగర్కు చెందిన ప్రియాన్ష్ మిత్తల్ను కలిశాడు. అయితే కొత్తకారు కావడంతో సరదాగా అలా అవుటర్ రింగ్ రోడ్డును చుట్టొద్దామని ప్లాన్ చేసుకున్నారు.
ముగ్గురు కలిసి కారులో శంషాబాద్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు మీదుగా ఘట్కేసర్ వైపు బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధి గండిచెరువు వంతెన సమీపంలోని రాగానే రోడ్డు పై నిలిపిఉన్న గూడ్స్ వాహనాన్ని గుర్తించకుండా వేగంగా ఢీ కొట్టారు. దీంతో కారు ముందుభాగం వాహనం కిందకి చొచ్చుకెళ్లింది. దీంతో వాహనానికి మంటలంటు కున్నాయి. దీన్ని గమనించిన స్థానికులు మంటలార్పడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
మంటలు ఎక్కువగా ఉండడంతో వారిని రక్షించడం సాధ్యం కాలేదు. దీపేశ్ అగర్వాల్, సంచయ్ మల్పానీ మంటల్లో సజీవ దహనమయ్యారు. మంటలార్పి ప్రియాన్ష్ మిత్తల్ను బయటకు తీసి ఎల్బీనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా అర్థరాత్రి ఎలాంటి సూచికలు లేకుండా నో పార్కింగ్ ప్రాంతంలో డ్రైవర్ కృష్ణ వాహనాన్ని నిర్లక్ష్యంగా నిలిపి ప్రమాదానికి కారణమయ్యాడని రితేశ్కుమార్ అగర్వాల్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
