IND vs NZ: రోహిత్ వ్యూహాత్మక తప్పిదాలు తొలి టెస్టులో ఓటమికి దారితీశాయా? తన కీలక బౌలర్లను ప్రయోగించడంలో ఆలస్యం చేశాడా? టెస్టు ఛాంపియన్ షిప్లో కీలకమైన కివీస్ టెస్టును పోగొట్టుకున్న తర్వాత సహజంగానే టీమిండియా కెప్టెన్ రోహిత్ పై విమర్శల వాన కురుస్తోంది.
పిచ్ ను సరిగా రీడ్ చేయలేకపోయానంటూ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ పతనం తర్వాత ప్రకటించాడు. కేవలం 46 పరుగులకే టీమిండియా చేతులెత్తేసినా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించడంపై విస్మయాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిదో వికెట్కు కివీస్ అత్యంత కీలకమైన 137 పరుగులను జోడించడం మ్యాచ్ లో కీలక మలుపు. తన బౌలింగ్ వనరులను సరిగా వినియోగించుకోలేదనే అపవాదు రోహిత్ ఎదుర్కొన్నాడు. దీనికి తోడు చివరి రోజు కివీస్ 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సందర్భంలోనైనా భారత సారథి వ్యూహాత్మకంగా వ్యవహరించలేదన్నది విమర్శకుల వాదన.
107 పరుగుల లక్ష్యం చిన్నదే. కానీ తన మ్యాచ్ విన్నర్ రవిచంద్రన్ అశ్వన్ ను కేవలం కివీస్ లక్ష్యం 10 పరుగులు ఉన్నపుడు బౌలింగ్ కు దించాడు రోహిత్. అశ్విన్ కన్నా ముందు మహ్మద్ సిరాజ్ను రెండు దఫాలుగా 7 ఓవర్లు వేయించాడు. బుమ్రా తొలి వికెట్ తీసిన తర్వాత సిరాజ్ ను ఒకటి రెండు ఓవర్లతో ఆసేసి అశ్విన్ను రంగంలోకి దించి ఉండాల్సిందని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
అయితే రోహిత్ పట్టించుకోకుండా పాజిటివ్స్ నే ప్రస్తావించాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 46 పరుగులకే ఆలౌటై 356 పరుగులు వెనుకబడిన తర్వాత టీమిండియా పుంజుకుని 462 పరుగులు చేసిన తీరును కొనియాడాడు. కోహ్లి-సర్ఫరాజ్, సర్ఫరాజ్-పంత్ భాగస్వామ్యాలు మళ్లీ భారత్ ను పోటీలోకి తెచ్చాయన్నాడు. 18 సిరీసుల అప్రతిహత విజయాలను కొనసాగించాలంటే టీమిండియా తన తదుపరి రెండు మ్యాచుల్లోనే గెలిచి తీరాలి. రెండో టెస్టు పుణెలో అక్టోబరు 24న ప్రారంభమవుతుంది.