Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక విషాదకర ఘటన వెలుగుచూసింది. పుట్టకముందే ఈ లోకాన్ని చూడాల్సిన ఒక ఆడ శిశువు, నెలలు నిండకుండానే విగతజీవిగా మురికి కాలువలో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని షాబునగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ చిన్నారి మృతదేహాన్ని కాలువలో పడేశారు.
బుధవారం ఉదయం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటిలాగే కాలువలు శుభ్రం చేస్తుండగా, వారికి ఈ శిశువు మృతదేహం కనిపించింది. ఇది చూసి షాక్కు గురైన సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ సీఐ నాగభూషణరావు తన బృందంతో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ అమానుషానికి ఒడిగట్టిన వారు ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. పట్టణంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుంటామని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
