Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ఇది నిజంగా శుభవార్త. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలతో పాటు, పంచాయతీరాజ్ , ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఒకేసారి విడుదల చేసింది. అక్టోబర్ నెలకు గాను మొత్తం రూ.1,031 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా క్లియర్ చేస్తూ వస్తున్న డిప్యూటీ సీఎం, తాజాగా అక్టోబర్ మాసానికి సంబంధించిన రూ.712 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలతో పాటు, రూ.10 లక్షలలోపు విలువైన పెండింగ్ బిల్లులను పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి శాఖలకు చెందిన మొత్తం 46,956 బిల్లులకు సంబంధించిన రూ.320 కోట్ల రూపాయలను విడుదల చేశారు. రోడ్లు, భవనాల శాఖ కి చెందిన రూ.10 లక్షలలోపు విలువైన 3,610 బిల్లులకు సుమారు రూ.95 కోట్లు విడుదలయ్యాయి. అదేవిధంగా, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ స్థానిక సంస్థలకు చెందిన 43,364 బిల్లుల మొత్తం రూ.225 కోట్ల రూపాయలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం ఉదయం ప్రజా భవన్లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.


