Stalin: తమిళ రాజకీయాల్లో ట్విట్టర్ వేదికగా ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని తమిళనాడు ప్రజలు ఎన్డీఏ కూటమితో ఉన్నారని వ్యాఖ్యానించగా, దీనికి సీఎం ఘాటుగా స్పందించారు. మోదీ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, తమిళనాడు ఎప్పుడూ ఎన్డీఏకు ఓటమినే ఇస్తుందని స్పష్టం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో ప్రజల మద్దతు లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని ఆయన పేర్కొన్నారు.
స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక అంశంలో కూడా విమర్శలు చేశారు. తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన రూ.3,458 కోట్ల నిధులు ఇంకా విడుదల చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను ఆలస్యం చేయడం ద్వారా కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కేంద్రం మాటలకే పరిమితం కాకుండా రాష్ట్రాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ పాత్రపై కూడా స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ను బీజేపీకి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పనుల్లో అనవసర జోక్యం చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ అరాచకాలు ఎప్పుడు ముగుస్తాయో కేంద్రం స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఈ వివాదం తమిళనాడులో కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై మరోసారి రాజకీయ వేడిని పెంచింది.
