Aghori Srinivas: తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన అఘోరీ శ్రీనివాస్ అసలు స్వరూపంపై ఆయన మాజీ అనుచరురాలు శ్రీ వర్షిణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆధ్యాత్మికత ముసుగులో సాగుతున్న విలాసవంతమైన జీవనశైలిని ఆమె కళ్లకు కట్టినట్లు వివరించారు. దాదాపు రెండు నెలల పాటు ఆయన వెంటే ఉండి, ఆయన దైనందిన కార్యకలాపాలను దగ్గరుండి చూసిన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడంతో, ఈ ‘అఘోరీ’ ప్రస్థానం వెనుక ఉన్న ఆర్థిక కోణాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీ వర్షిణి వెల్లడించిన వివరాల ప్రకారం.. అఘోరీ శ్రీనివాస్ సంపాదన సగటున రోజుకు రూ. 25 వేల నుండి రూ. 30 వేల వరకు ఉంటుంది. వివిధ ఆలయాల సందర్శన పేరుతో ఆయన తిరుగుతున్నప్పుడు, ఆయనకున్న క్రేజ్ చూసి భక్తులు భారీగా విరాళాలు సమర్పించేవారని ఆమె తెలిపారు. భక్తులు ఇచ్చే రూ. 500, రూ. 1000 నోట్లతో ఆయన జేబులు ఎప్పుడూ నిండుగానే ఉండేవట. విచిత్రమేమిటంటే, ఆయన ప్రయాణించే కారుకు పెట్రోల్ ఖర్చుల నుండి ప్రతి చిన్న అవసరాన్ని భక్తులే భరిస్తుండటంతో, శ్రీనివాస్కు వ్యక్తిగత ఖర్చులు అనేవే లేవని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: High Court: చిరంజీవి, ప్రభాస్ సినిమాలకి హైకోర్టులో ఊరట
అఘోరీ అంటే లోకంతో సంబంధం లేకుండా, కఠిన నియమాలతో ఉండాలని భావించే భక్తులకు.. శ్రీ వర్షిణి చెప్పిన విషయాలు షాక్ ఇస్తున్నాయి. బయటకు అఘోరీగా కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతాడని అన్నారు. అన్నీ ఉచితంగానే లభిస్తుండటంతో ఆయన జీవితం రాజభోగంలా సాగుతోందని ఆమె వివరించారు. ప్రజల్లో ఉన్న భక్తిని, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఇంత పెద్ద మొత్తంలో నగదు వసూలు చేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ ఇంటర్వ్యూ వైరల్ కావడంతో, అఘోరీ శ్రీనివాస్ ఆధ్యాత్మిక ప్రసంగాలు మరియు ఆయన ప్రవర్తనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజమైన ఆధ్యాత్మికత విలాసాలకు దూరంగా ఉండాలని, కానీ ఇక్కడ పరిస్థితి దానికి భిన్నంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీ వర్షిణి చేసిన ఈ సంచలన ఆరోపణలు అఘోరీ శ్రీనివాస్ భవిష్యత్తుపై, ఆయనకున్న ఫాలోయింగ్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
