న్యూజిలాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ తప్పుకున్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో 2-0 తేడాతో న్యూజిలాండ్ ఘోర పరాభావం చూసిన తర్వాత సౌథీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నాకు ఇష్టమైన రెడ్ బాల్ ఫార్మాట్లో న్యూజిలాండ్ కెప్టెన్గా పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్లో జట్టును నెం1గా నిలపడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఆటగాడిగా నావంతు పాత్ర పోషిస్తున్నాను. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ ప్రకటనలో సౌథీ పేర్కొన్నాడు.
కాగా గతేడాది కేన్ విలియమ్సన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన సౌథీ కెప్టెన్ గా పర్వాలేదనిపించాడు. అతడి కెప్టెన్సీలో 14 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన న్యూజిలాండ్ టీమ్.. ఆరు మ్యాచ్ల్లో విజయం సాధించగా, మరో 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మరో రెండు డ్రాగా ముగిశాయి.
కెప్టెన్సీ నుంచి సౌథీ తప్పుకోవడంతో అతని స్థానంలో బ్యాటర్ టామ్ లాథమ్ కెప్టెన్గా నియామకం అయ్యారు. లాథమ్ వన్డే, టెస్టు ఫార్మాట్లో కివీస్ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. అక్టోబర్ 16 నుంచి ఇండియాతో జరిగే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ నుంచి లాథమ్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఇండియా, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 16 నుంచి బెంగళూరులో తొలి టెస్ట్, 24 నుంచి పుణేలో రెండో టెస్ట్, నవంబర్ 1 నుంచి ముంబైలో మూడో టెస్ట్ జరగనుంది.