Rythu Bharosa: తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే విత్తనాలు నాటే పనులు, నాట్లు వేసే పనులు పూర్తయ్యాయి. ఎరువులు, విత్తనాలను రైతులు తెచ్చుకున్నారు. పురుగు మందులు కొట్టే సమయం ఆసన్నమైంది. రైతు భరోసా నిధుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని రైతులు భావించారు. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధమైంది.
Rythu Bharosa: కానీ, ఈ దశలో నిధుల విడుదలకు ముందుకు అడుగులు పడలేదు. ఇప్పటికే పండుగ సమీపించడంతో ఈ పండుగకు నిధుల విడుదల కావడం లేదని తేలిపోయింది. అందుకే ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ముఖ్యంగా ఈసారి శాటిలైట్ సర్వే ఆధారంగా పంటల భూములకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని సర్కార్ భావిస్తున్నది. మరో విధంగా ఖజానాలో నిధుల కొరత ప్రభుత్వాన్ని వేధిస్తున్నది. ఈ రెండు కారణాలతో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Rythu Bharosa: రైతు భరోసా పథకానికి రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారని తెలుస్తున్నది. ఎకరానికి ఈ విడత రూ.6,000 చొప్పున రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం వారి ఖాతాల్లో వేయనున్నది. ఈ యాసంగి సీజన్లో సుమారు కోటి ఎకరాలకు రైతు భరోసా నిధులు వేసే అవకాశం ఉన్నది. దీనికోసం సుమారు రూ.9 వేల కోట్లు అవసరం ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది.
