Road Accident: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. చిలకలడోన గ్రామ సమీపంలో భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన తీరు
పోలీసులు కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన సుమారు 20 మంది భక్తులు ఒక బొలెరో వాహనంలో మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనం కోసం బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున వాహనం మంత్రాలయం సమీపంలోని చిలకలడోన వద్దకు చేరుకోగానే, ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన తీవ్రతకు బొలెరో వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ఆసుపత్రిలో క్షతగాత్రుల పరిస్థితి
ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. తెల్లవారుజామున చీకటిగా ఉండటం, వాహనం వేగంగా ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
విషాదంలో చిక్మంగళూరు.. రంగంలోకి పోలీసులు
స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని బయలుదేరిన భక్తులు, గమ్యస్థానానికి చేరువలో ఉండగా మృత్యువాత పడటంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మంత్రాలయం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక నిద్రమత్తు కారణమా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
