Mysaa Glimpse: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా’ (Mysaa) ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్ప-2, ఛావా, కుబేర వంటి భారీ చిత్రాలతో ఈ ఏడాది బాక్సాఫీస్ను షేక్ చేసిన రష్మిక, ఇప్పుడు ఒక పవర్ఫుల్ గిరిజన యోధురాలిగా మన ముందుకు రాబోతోంది. నేడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను చిత్ర బృందం విడుదల చేయగా, అందులో రష్మిక ఊరమాస్ అవతారం చూసి అభిమానులు షాక్కు గురవుతున్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో నివసించే ‘గోండు’ గిరిజన తెగల జీవన విధానం, వారి హక్కుల కోసం పోరాడే ఒక వీరనారి కథా నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్లో వినిపించే “మట్టే వణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాచలేక… గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరి మోయలేక… అగ్గే బూడిదయింది మండుతున్న నా బిడ్డను చూడలేక… ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డను సంపలేక” అనే డైలాగులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ వీడియోలో రష్మిక ముఖంపై రక్తపు మరకలతో, చేతికి సంకెళ్లతో ఉంటూనే తుపాకీ పట్టుకుని శత్రువులపై గురిపెట్టిన తీరు ఆమె కెరీర్లోనే ‘నెవర్ బిఫోర్’ అని చెప్పవచ్చు.
Also Read: Mahesh Babu: ‘వారణాసి’ కోసం కలరీపాయట్టు శిక్షణలో మహేష్ బాబు.!
దర్శకధీరుడు హను రాఘవపూడి వద్ద అసిస్టెంట్గా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ‘కల్కి 2898 AD’ ఫేమ్ అంతర్జాతీయ స్టంట్ మాస్టర్ ఆండీ లాంగ్ ఇందులోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లను డిజైన్ చేస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, తారక పొన్నప్ప, రావు రమేష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
