Ponnam Prabhakar: ఓట్ల కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేయడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం బలవంతంగా ఆధార్, పాన్ వివరాలు సేకరించడం లేదని వెల్లడించారు. ఇష్టముంటేనే కులం, ఆధార్, పాన్ వివరాలు చెప్పొచ్చన్నారు. వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాధ్యతతో సర్వే చేస్తున్నామని తెలిపారు. జీవో 18 ప్రకారంగానే సర్వే జరుగుతున్నదని చెప్పారు.
రాజకీయ ప్రయోజనం కోసం సర్వేలు చేసి లబ్ధి పొందే ఆలోచన లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్నను దర్శింకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్యుమరేటర్ల విధులకు ఆటకం కలిగిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చేసిన సర్వేను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పారు.
సర్వే వల్ల సంక్షేమ పథకాల కోత ఉండదని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్లో పలుచోట్ల కొందరు ఇబ్బందులు కలిగించారు, అది సరైనది కాదని చెప్పారు. కేవలం కులాల జనాభా తెలుసుకునేందుకే ఈ సర్వే చేస్తున్నామని వెల్లడించారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కుల గణన, సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం పరిశీలించారు.