Narendra Modi

Narendra Modi: సంవత్సరం పాటు బంగారం కొనకండి.. పెట్రోల్,ఆయిల్ చూసి వాడండి..!

Narendra Modi: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ముదురుతోంది. ఈ నేపథ్యంలో, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు అత్యంత కీలకమైన విన్నపం చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) పద్ధతిని అమలు చేయాలని, పెళ్లిళ్లకు ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని ఆయన దేశ ప్రజలను కోరారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో భారత్‌పై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. ఆదివారం ఆయన ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశభక్తిని కేవలం నినాదాల్లోనే కాకుండా, పొదుపు చర్యల్లోనూ చూపాలని కోరారు.

మళ్లీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రారంభించండి!

“కరోనా కాలంలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో కాన్ఫరెన్స్‌ల వంటి ఆన్‌లైన్ విధానాలకు అలవాటు పడ్డాం. ఇప్పుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ పద్ధతులను మళ్లీ అమలు చేయాలనీ ” అని ప్రధాని సూచించారు. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి, విదేశీ కరెన్సీని ఆదా చేయవచ్చని ఆయన వివరించారు.

బంగారం, వంట నూనె వినియోగంపై నియంత్రణ

ప్రధాని తన ప్రసంగంలో కొన్ని ఆసక్తికరమైన ఇంకా సాహసోపేతమైన విన్నపాలు చేశారు.

  • బంగారం కొనుగోలు: దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి దృష్ట్యా, కనీసం ఒక ఏడాది పాటు పెళ్లిళ్లకు బంగారం కొనవద్దని ప్రజలను కోరారు. బంగారం దిగుమతుల కోసం విదేశీ కరెన్సీ భారీగా వెచ్చించాల్సి వస్తుండటమే దీనికి కారణం.

  • వంట నూనె: ప్రతి కుటుంబం వంట నూనె వినియోగాన్ని కొంచెం తగ్గించినా, అది దేశ ఖజానాకు ఇంకా ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని ఆయన అన్నారు.

మే 15 లోపు ఇంధన ధరల పెరుగుదల?

ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి 126 డాలర్లకు చేరడంతో భారత చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

  • భారీ నష్టం: ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు నెలకు సుమారు రూ. 30,000 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి.

  • ధరల పెంపు సూచన: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 4 నుండి రూ. 5 వరకు, ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.

రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పిలుపు

రసాయన ఎరువుల దిగుమతి కోసం విదేశీ మారక ద్రవ్యం భారీగా ఖర్చవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని సగానికి తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని కోరారు. దీనివల్ల విదేశీ కరెన్సీ ఆదా అవ్వడమే కాకుండా భూసారం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు ఇప్పటికే చమురు సంక్షోభం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, భారత్ మాత్రం ముందస్తు చర్యల ద్వారా సరఫరాను క్రమబద్ధీకరిస్తోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *