Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) “ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్”కు నిదర్శనం అని అన్నారు. 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారుతోందని, దేశ ఆర్థిక బలం మరియు ప్రజాస్వామ్యంపై ప్రపంచానికి నమ్మకం పెరుగుతోందని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ద్వారా భారతదేశానికి, ముఖ్యంగా యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత తయారీదారులు పన్నుల తగ్గింపుపై మాత్రమే కాకుండా, తమ ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. యూరప్లోని 27 దేశాల మార్కెట్లు ఇప్పుడు భారత ఉత్పత్తులకు తెరుచుకున్నాయని, అత్యుత్తమ నాణ్యతతో అక్కడి ప్రజల నమ్మకం గెలుచుకోవాలని అన్నారు. ఈ ఒప్పందం రైతులు, సేవల రంగ నిపుణులు మరియు యువతకు ప్రపంచ మార్కెట్లలో కొత్త అవకాశాలు తెస్తుందని చెప్పారు.
2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యాన్ని సాధించడంలో ఈ బడ్జెట్ సమావేశాలు కీలకమైన అడుగు అని ప్రధాని అన్నారు. ప్రభుత్వం సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే సూత్రాలతో ముందుకు సాగుతోందని, టెక్నాలజీని ఉపయోగిస్తూ చివరి వ్యక్తి వరకు లబ్ధి చేర్చడమే లక్ష్యమని తెలిపారు.
అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ పార్లమెంటరీ చరిత్రలో గర్వకారణమని మోదీ ప్రశంసించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించిందని అన్నారు. దేశాభివృద్ధి కోసం ఎంపీలందరూ నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలని కోరారు.
