Mobile addiction: దేశంలో పిల్లలు మరియు యువతలో డిజిటల్ వ్యసనం (మొబైల్, సోషల్ మీడియా, గేమ్స్ ఎక్కువగా వాడటం) ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సర్వేలో ఈ విషయం స్పష్టంగా పేర్కొనబడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిజిటల్ పరికరాలకు ఎక్కువగా అలవాటు పడటం వల్ల యువతలో చదువుపై దృష్టి తగ్గడం, పనితీరు తగ్గిపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు పెరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది.
ప్రత్యేకంగా 15–24 సంవత్సరాల వయసు యువతలో సోషల్ మీడియా వ్యసనం ఎక్కువగా ఉందని సర్వే తెలిపింది. సోషల్ మీడియాలో ఇతరులతో తమను పోల్చుకోవడం, గంటల తరబడి స్క్రోలింగ్ చేయడం, ఆన్లైన్ గేమింగ్ వంటి అలవాట్లు ఆందోళన, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి మానసిక సమస్యలకు కారణమవుతున్నాయని హెచ్చరించింది.
ఈ సమస్యను తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. మానసిక ఆరోగ్య సహాయం కోసం ‘టెలీ-మానస్’ కార్యక్రమం ద్వారా లక్షలాది కాల్స్ స్వీకరించామని, టెక్నాలజీ వ్యసన చికిత్స కోసం ప్రత్యేక క్లినిక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించేందుకు 2025లో ప్రత్యేక చట్టం కూడా తీసుకువచ్చామని పేర్కొంది.
డిజిటల్ వాడకాన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాదని, కానీ సరైన సమతుల్యత అవసరమని సర్వే సూచించింది. పాఠశాలల్లో “డిజిటల్ వెల్నెస్” పై అవగాహన పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడం, యువత కోసం ఆఫ్లైన్ యూత్ హబ్స్ ఏర్పాటు చేయడం వంటి సూచనలు చేసింది. యువత భవిష్యత్తు బలంగా ఉండాలంటే శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై సమగ్ర దృష్టి అవసరమని సర్వే స్పష్టం చేసింది.
